ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తి జనసేన ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా రూ.లక్షను విరాళంగా పంపించారు. ఈ మేరకు శ్రీనివాసులు పంపిన మొత్తం తమకు అందిందని పార్టీ ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా సహకరించిన శ్రీనివాసులుకు ధన్యవాదాలు చెబుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది.
అటు జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా సభను నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ శుక్రవారం రోజు వెల్లడించారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభావేదిక నుంచి భవిష్యత్తు కార్యాచరణ, పార్టీపరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీ అంటే ఒక బృంద ప్రయత్నమని, కలిసికట్టుగా జనసైనికులు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏయే గ్రామాల్లో జన సైనికులు ఉత్సాహంగా పని చేస్తున్నారో గమనించి వారికి ఎన్ఆర్ఐ మద్దతుదారుల ఉడతాసాయంగా అండగా నిలిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
