ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని జీవీఎల్ అన్నారు.
Read Also: ఏపీలో ఇకపై అన్ని సేవలకు ఒకే పోర్టల్… ప్రారంభించిన సీఎం జగన్
ఉత్తర ప్రదేశ్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం, విచ్చలవిడిగా స్వైరవిహారం చేసిన గూండాలను ఏరివేసిన కారణంగా తిరిగి రాష్ట్రంలో మరోసారి బీజేపీకే ప్రజలు అధికారం అప్పగిస్తారని జీవీఎల్ తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల బలమైన జాట్ సామాజిక వర్గంలో బీజేపీ పై విముఖత , ఆగ్రహం ఉన్న అది చాలా పరిమిత సంఖ్యలోనే అని చెప్పారు. వాస్తవానికి, రద్దైన వ్యవసాయ చట్టాలతో సగటు రైతుకు మేలు జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్లో కూడా ఈసారి మాదే విజయమని తెలిపారు. మణిపూర్, గోవాలో బీజేపీ తమ అభ్యర్థులతో ప్రమాణాలు, హామీ పత్రాలు రాయించుకోవడం కేంద్ర నాయకత్వం ఆలోచన, నిర్ణయం కాదని వెల్లడించారు. నైతిక బాధ్యత కోసం ఆ రెండు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ప్రయత్నాలు అయి ఉండొచ్చునని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేలు, నాయకులు బీజేపీలో చేరారు కానీ మా పార్టీ నుంచి ఎవ్వరూ కాంగ్రెస్లో చేరలేదన్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఈ సారి విజయం మాదేనని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
