NTV Telugu Site icon

Minister Narayana: దాచేప‌ల్లిలో డ‌యేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..

Narayana

Narayana

Minister Narayana: పల్నాడు జిల్లా దాచేప‌ల్లిలో డ‌యేరియా ప‌రిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి నారాయ‌ణ‌.. ప‌ల్నాడు జిల్లా క‌లెక్టర్ తో పాటు ఇత‌ర అధికారుల‌తో మాట్లాడారు మంత్రి.. అయితే, ప్రస్తుతం దాచేప‌ల్లిలో డ‌యేరియా అదుపులోనే ఉంద‌ని కలెక్టర్‌ వివరించారు.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేద‌ని వెల్లడించారు.. ఇక, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యాధికారులు తెలియజేశారు.. స్థానికంగా ఉన్న బోర్లను మూసివేసి ట్యాంక‌ర్ల ద్వారా మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు దాచేపల్లి న‌గ‌ర‌పంచాయ‌తీ అధికారులు.

Read Also: Donald Trump: కమలా హరీస్ గెలిస్తే.. చైనా చెడుగుడు ఆడేస్తుంది..

కాగా, దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా ప్రబలింది.. రెండు రోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.. వీరిలో ఓ విద్యార్థితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధుడు కూడా ప్రాణాలు విడిచాడు.. అయితే, డయేరియా తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి కలుషిత నీరు తాగడమే కారణం అంటున్నారు అధికారులు.. తాగునీటి పైపు లైన్లు మురుగు కాలువలో ఉండటం వల్ల నీరు కలుషితమై ఉండవచ్చని భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డయేరియా కేసులు కలవరపెడుతోన్న విషయం విదితమే..