Divyang Shakti Scheme: దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకం ప్రారంభించడం ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకాన్ని మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ లు పాల్గొన్నారు. బస్టాండ్ లో దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో మంగళగిరి నుంచి పెనుమాక వరకూ ప్రయాణించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన21నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. దివ్యాంగులు సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్నవాళ్లన్నారు. గతంలో చేయూత, ట్రైసైకిళ్లు పంపిణీ చేశామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగుల పింఛన్ ఆరువేలు ఇస్తున్న రాష్ట్రం మనదేనని గుర్తు చేశారు. ఛార్జీలు లేకుండా ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించ వచ్చన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో దివ్యాంగులను ఆదుకునేందుకు మరింత ఆలోచనలు చేస్తామన్నారు. దివ్యాంగశక్తి పథకం ద్వారా 12లక్షల 75వేలమందికి ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందన్నారు.
Read Also: ICC ODI Rankings : ఐసీసీ ర్యాంకులు.. టాప్-5 వన్డే బ్యాటర్లలో భారత్ నుంచి ముగ్గురు..
