Farmers Protest: గో బ్యాక్ జేడీ వాన్స్‌..! రైతుల నిరసన కార్యక్రమాలు..

  • "వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు"..
  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు..
  • అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు రైతుల నిరసన
Vance Go Back

Vance Go Back

Farmers Protest: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన వేళ.. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ “వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు” అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికా పాలు వద్దు.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని నాశనం చేయవద్దు అంటూ నినాదాలు చేశారు.

Read Also: BCCI Central Contract 2025: ఆ ఇద్దరికి మళ్లీ చోటు.. తెలుగు కుర్రాడికి ఛాన్స్‌!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అమెరికా ఉత్పత్తులకు సంబంధించిన సుంకాలు, సుంకం-యేతర అడ్డంకులను తగ్గించే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారన్నారని రైతులు మండి పడ్డారు.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పాడి రైతులకు మరణ శాసనం కానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు మరియు మార్కెట్ పరిమితులు తొలగిస్తే భారతదేశానికి అమెరికా పాడి ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అయ్యి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అమెరికా నుండి చౌకైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, ఆపిల్ మొదలైన వాటిని భారతదేశంలోకి డంప్ చేయడానికి, మన మార్కెట్‌ను ముంచెత్తడానికి జరుగుతున్న వాణిజ్య చర్చలు మన వ్యవసాయరంగాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఇది రైతులు కష్టపడి పండించిన పంటల ధరల పతనానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Crime News: ఉచిత సలహా ఇచ్చి.. బంగారు ఆభరణాలను అపహరించిన నకిలీ పోలీసులు!

చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలు ట్రంప్ సుంకాలను దృఢంగా తిప్పికొట్టి తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వచ్చినప్పటికీ, మన కేంద్ర ప్రభుత్వం లొంగిపోయి అమెరికాకు ఊడిగం చేస్తోందన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన దేశ పర్యటన బహుళజాతి కంపెనీలకు భారీ లాభాలు కట్టబెట్టి, మన దేశ రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. మన దేశ రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగించే అమెరికాతో భారత్ ద్వైపాక్షిక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలని కోరారు రైతులు..