Site icon NTV Telugu

TTD laddu controversy: టీటీడీ లడ్డు కేసులో హవాలా కోణం.. రూ. 234.5 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ ఎంక్వైరీ

Laddu

Laddu

TTD laddu controversy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీలో అవకతవకలు, హవాలా లావాదేవీల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక అంశాలను గుర్తించడంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఐటీ రూపొందించిన నివేదికలో, టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి సరుకుల సరఫరా, కాంట్రాక్టులు, నాణ్యత తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా నెయ్యి సరఫరా, టెండర్ల మంజూరు, ల్యాబ్ పరీక్షల నివేదికల విషయంలో అవినీతి చోటు చేసుకున్నట్టు SIT గుర్తించింది.

Read Also: Ramayana: ‘రామాయణ’లో విజయ్ సేతుపతి? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మక్కల్ సెల్వన్!

అయితే, ఎస్‌ఐటీ నివేదిక ప్రకారం, లడ్డూ తయారీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్‌వర్క్ ద్వారా డబ్బు తరలింపులు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ. 234.5 కోట్లకు పైగా నిధుల మళ్లింపు జరిగినట్టు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ అక్రమ లావాదేవీల్లో మధ్యవర్తులు, డైరీ సంస్థలు, సరఫరాదారులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతకు సంబంధించిన ల్యాబ్ నివేదికలను ఉద్దేశపూర్వకంగా దాచి, సరఫరా కొనసాగించేందుకు కొందరు అధికారులు సహకరించారని SIT పేర్కొన్నట్టు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని కూడా అనుమతించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !

ఇక, ఎస్‌ఐటీ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బును ఎలా మళ్లించారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది, ఏ హవాలా ఏజెంట్ల ద్వారా తరలించారు అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలోనే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారం టీటీడీ ప్రతిష్ఠకే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందు భక్తుల భావోద్వేగాలను కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేయనుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version