Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు

Medical Student Priyanka Ca

Medical Student Priyanka Ca

Medical Student Priyanka Case: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును.. ఆమె మృతి చెందడంతో హత్య నేరం కిందకు మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన BNS సెక్షన్ 110ను తాజాగా BNS సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు నిందితులను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మృతి నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, కారణాలు, ఇతర అంశాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం నిందితుల విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహం ఉంది.. కిమ్స్ మార్చురీలో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు వైద్యులు.. ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు రాజమండ్రి పోలీసులు .. కిమ్స్ లో శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించనున్నారు.. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ప్రియాంక మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు.. గద్వాల జిల్లాలోని అయిజ మండలంలోని ఎక్లాస్‌పూర్ ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. చాలా కాలంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ప్రియాంక కుటుంబ సభ్యులు.. తమ కలల సౌధం కూలిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు.. మరోవైపు.. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయాల ఆర్థిక సహాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం..

రాజమండ్రిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన మెడికో ప్రియాంక.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే..