Mithun Reddy Mother Emotional: రాజమండ్రి జైలు వద్ద కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ మిథున్‌ రెడ్డి తల్లి..

  • రాజమండ్రి జైలులో మిథున్‌రెడ్డిని కలిసిన కుటుంబ సభ్యులు..
  • మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ తల్లి స్వర్ణలత..
  • జైలులో నా కుమారుడిని టెర్రరిస్టుగా చూస్తున్నారని ఆవేదన..
  • తన కుమారుడికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీరు..
Mithun Reddy Mother Emotion

Mithun Reddy Mother Emotion

Mithun Reddy Mother Emotional: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, లోక్‌సభ ఎంపీ మిథున్‌రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో నా కుమారుడిని టెర్రరిస్టుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్‌ రెడ్డిని ములాఖత్ లో కలిశారు ఆయన కుటుంబ సభ్యులు.. అందులో మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్ ఉన్నారు.. ములాఖాత్ తర్వాత మీడియాతో మాట్లాడిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత.. సెంట్రల్ జైలులో తన కుమారుడికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్వంతమయ్యారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు..

Read Also: Arabia Kadali: సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ‘అరేబియా కడలి’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

మరోవైపు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కోర్టు కల్పించిన సౌకర్యాలుపై జైలు అధికారులు రివ్యూ పిటిషన్ వేయడం కక్ష పూరిత చర్యలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనకిచ్చిన సదుపాయాలపై ఏనాడు రివ్యూ పిటిషన్ వేయలేదని గుర్తు చేశారు. ఏసీ సదుపాయం కూడా కల్పించామని అన్నారు. జైలు అధికారులపై ప్రభుత్వ ఒత్తిడి ఎంత ఉందో రివ్యూ పిటిషన్ వేయడం చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.