ఛలో విజయవాడ సక్సెస్.. జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు..!

పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛ‌లో విజ‌య‌వాడ విజ‌య‌వంతం అయ్యింద‌ని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక‌, ఛ‌లో విజ‌య‌వాడ‌పై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌.. క‌ర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జ‌గ‌న్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేద‌న్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం లేద‌ని నిల‌దీశారు రామ‌కృష్ణ‌.. సీఎం వైఎస్ జగన్ ఏమన్నా పైనుంచి ఊడి పడ్డారా? అంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. జగన్ సీఎంగా ఉండగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

Read Also: ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు… అందుకే ఆ మాట‌లు..!

ఇక‌, సమస్య పరిష్కారం చేయమంటే జగన్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించిన రామ‌కృష్ణ‌.. జిల్లాల విభజన సమాచారాన్ని మంత్రలకు ఆన్ లైన్ లో పంపి సీఎం ఆమోదం తెలిపారు.. రానున్న రోజుల్లో జగన్ ఆన్ లైన్ లోనే భోజనం చేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు.. ఉద్యోగుల సమస్యలపై జగన్ నేరుగా జోక్యం చేసుకోవాలి.. లేకపోతే ఉద్యోగులు జగన్ ను ఇడుపులపాయ ఇంటికి పంపిస్తార‌ని హెచ్చ‌రించిన ఆయ‌న‌.. ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేయడం ఏమిటి? అని నిల‌దీశారు. జిల్లాల విభజనపై ఫిబ్రవరి ఎనిమిదో తేదీన విజయవాడలో సిపిఐ కార్యవర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు రామ‌కృష్ణ‌.