వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని.. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో కూడా సర్వే పూర్తి కానున్నట్టు సీఎంకు తెలిపారు.. ఇక, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్డేట్ కావాలని.. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలని తెలిపారు… న్యాయ, ల్యాండు రికార్డుల్లో నిపుణులు, అనుభవం ఉన్న వారితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. వీరిచ్చిన సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి ఎస్వోపీలు రూపొందించాలన్నారు.. ఇక, ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కోసం ప్రతి ఏటా ఒక వారం డ్రైవ్ చేపట్టాలని.. ల్యాండ్ సర్వేను పూర్తి చేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
సంస్కరణలు అవినీతికి చోటులేకుండా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలన్నారు సీఎం వైఎస్ జగన్.. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. 22ఏ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలన్నారు.. దీని కోసం ఆధీకృత వ్యవస్థను బలోపేతంచేయాలని ఆదేశించారు.