మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు నిండడంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. మాండూస్ తుఫాన్పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Tigers and Leopards: భయం భయం.. ఓవైపు పులులు.. మరోవైపు చిరుతలు..
మాండూస్ తుఫాన్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వివిధ జిల్లాల్లో తుఫాన్ ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని.. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
