ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు

YS Jagan

ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై మంత్రుల బృందంతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. కీలక సూచనలు చేశారు.. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు.. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్‌ వద్దే కొనుగోళ్ళు జరగాలని.. మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని.. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్న ఏపీ సీఎం.. పేమెంట్స్‌లో మోసాలు లేకుండా వేగంగా పేమెంట్లు చేయడానికి ఈ–క్రాప్‌ బుకింగ్, ఈ కేవైసీ అమలు చేయాలన్నారు.

Read Also: రేపే బద్వేల్‌ ఉప ఎన్నికల ఫలితం.. కమలనాథుల లెక్క ఇది..!

వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చెల్లింపులు చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించేందుకు మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసేశామని స్పష్టం చేసిన ఆయన.. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. దీనిని ఒక సవాల్‌గా తీసుకుని అన్ని రకాలుగా సిద్ధంకావాలని సూచించారు. ఇక, ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ ఇవ్వాలని ఆదేశించారు సీఎం.. ధాన్యం సేకరణ పై వివరాలతో ఉన్న బోర్డును ఆర్బీకేల్లో ఉంచాలని.. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర అందాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.