CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం

  • అమరావతి నంబర్-1 లక్ష్యం
  • 2027లో పోలవరం పూర్తి
  • 'తల్లికి వందనం' నిధుల విడుదల
  • తప్పు చేస్తే చర్యలు తప్పవు : సీఎం చంద్రబాబు
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. గత ఏడాదిన్నర కాలంగా ప్రతీ మూడో శనివారం వస్తే తనకు గుర్తుకు వచ్చే ఏకైక పవిత్ర కార్యక్రమం ఇదేనని సీఎం పేర్కొన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టిన ఈ పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాడు రాజకీయాలంటే కేవలం దోపిడీ, అధికారంగా ఉండేవని.. కానీ పేదవాళ్లకు సంక్షేమం అందించి, అభివృద్ధికి దారి చూపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన దారిలోనే 40 ఏళ్లుగా టీడీపీ నడుస్తోందని, ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్‌గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. చరిత్రలో ఏ నాయకుడికి రాని గుర్తింపు తనకు ప్రజలు ఇచ్చారని, అందుకు జీవితాంతం రుణపడి ఉంటూ తెలుగు జాతికి రక్షకుడిగా ఉంటానని భావోద్వేగంగా మాట్లాడారు.

అమరావతి ప్రజల రాజధాని.. 2027 మార్చికి పోలవరం పూర్తి

రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఒక చిన్న బాలుడు తను దాచుకున్న డబ్బును విరాళంగా ఇవ్వడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది ప్రజల రాజధాని, దేవతల రాజధాని అని అభివర్ణించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో కరువు అనేదే లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. గతంలో 12 ఏళ్ల కంటే ముందు డెల్టాకు సకాలంలో నీళ్లు వచ్చేవని, నీళ్లే నాగరకతను తెస్తాయని చెప్పారు. దేశానికి అన్నం పెట్టిన కృష్ణా జిల్లా డెల్టాకు నీళ్లు లేని పరిస్థితుల్లో, 12 నెలల్లో పట్టిసీమను నిర్మించి గోదావరి జలాలతో డెల్టా రైతాంగాన్ని ఆదుకున్నామని గుర్తుచేశారు. ఆల్మట్టిలో నీరు లేకపోయినా, 48 శాతం వర్షాభావం ఉన్నా పట్టిసీమ అండగా నిలిచిందన్నారు. దీనికి తోడు వంశధార నుండి పెన్నా వరకు నదుల అనుసంధానం చేస్తామని, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

రూ.10,122 కోట్లతో ‘తల్లికి వందనం’.. ఆక్వా రంగానికి అండ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకోవడంలో వెనకడుగు వేయడం లేదని, సూపర్ సిక్స్ హామీలను సూపర్ గా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే సదరు తల్లికి ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుండి 24వ తేదీ మధ్య రూ. 10,122 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంగన్ వాడీలు, పారిశుధ్య కార్మికులకు సైతం ఈ పథకాన్ని అందిస్తున్నామని.. ఇది డబ్బులు ఉండి కాదు, కేవలం పేదలపై ఉన్న మంచి మనస్సుతోనే ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ, మిత్రుడు పవన్ కళ్యాణ్, తాను పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, పేదల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పి.4 విధానాన్ని తెచ్చామన్నారు. అలాగే ఆక్వా రంగానికి కేవలం రూ. 1.50 పైసలకే కరెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లి ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

క్రిమినల్స్ మారే పరిస్థితి లేదు.. తప్పు చేస్తే నా వాడైనా వదిలిపెట్టను

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసి, ప్రజలు తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో 2024 ఎన్నికల్లో తమకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఈ తీర్పును జీవితంలో మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. గుడివాడలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రామును భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, గుడివాడ అభివృద్ధికి రూ. 162 కోట్ల నిధులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని పినాయిల్ వేసి కడిగినా.. రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఆ పార్టీ చెత్త వాసనలు పోలేదని ఘాటుగా విమర్శించారు. క్రిమినల్స్ మారే పరిస్థితి లేదని, ఇంకా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి, తన చేతికి గొడ్డలి పెట్టి ‘నారాసుర రక్తచరిత్ర’ అని దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. తానే స్వయంగా నక్సలైట్ల దాడులు, మత గొడవలు ఎదుర్కొని ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడానని, కానీ ఇలాంటి గొడ్డలి పార్టీ అరాచకాలను, పోస్టర్లకు రక్తాభిషేకాలు చేసే ‘రప్పా రప్పా’ రాజకీయాలను తన జీవితంలో చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే సొంత వాడైనా, ఎదుటి వాడైనా ఒకటేనని.. గుంటూరులో తప్పు చేసిన టీడీపీ నాయకుడిని వెంటనే సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.