NTV Telugu Site icon

ఏపీ ఫైబర్‌నెట్‌ కేసు.. తొలిరోజు సీఐడీ విచారణ ఇలా..

ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు అధికారులు… విచారణకు హాజరుకావాలంటూ ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా చేసిన సాంబశివరావుతో పాటు.. టెండరు దక్కించుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో హరిప్రసాద్, సాంబశివరావు విచారణకు హాజరు అయ్యారు. సత్యనారాయణ పురంలోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రెండు గంటల పాటు నిందితులను వివిధ అంశాలపై అధికారులు విచారించారు.

ఇక, విచారణకు హాజరైన ఇద్దరు నిందితుల్లో హరిప్రసాద్ ను అధికారులు ప్రశ్నించలేదు. ఆయన కేవలం విచారణకు హారయ్యారు తప్ప… లోపల ఎలాంటి విచారణ జరగలేదు. మళ్లీ విచారణకు రావల్సి ఉంటుందని అధికారులు చెప్పారని… తాను వస్తానని చెప్పినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి అనేది అవాస్తవం అన్న హరి ప్రసాద్… విచారణ తర్వాత అన్ని అంశాలు వెల్లడిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన సాంబశివరావు ను మాత్రం కొద్ది సేపు విచారించినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి కొంత సమాచారం, కొన్ని అంశాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 321 కోట్లు కాగా….అందులో 121 కోట్ల అక్రమాలు జరిగాయి అనేది ఆరోపణ. నిబంధనలు ఉల్లంగించి టెండర్లు దక్కించుకున్నారని ప్రస్తుత యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇకపోతే నోటీసు అందుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ విచారణకు రాలేదు. ముందస్తు బెయిల్ కోసం గోపీచంద్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.