సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి సమాచారం అందడంతో విచారణ చేసేందుకు సిద్దమయింది. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారనే కోణంలో సీఐడి విచారణ చేస్తున్నది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై పోస్టులు పెట్టడం, లైకులు, కామెంట్స్, ఫార్వార్డ్ చేయడం నేరం అని, సీఐడీ సోషల్ మీడియా, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ దీనిపై లోతైన దర్యాప్తు చేసి, ఎంతటివారైనా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ తెలియజేసింది.