అమరావతిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. పార్టీ అనుబంధ కమిటీల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగి ఉపయోగం లేదన్నారు.
Read Also: Andhra Pradesh: అండర్-19 క్రికెటర్పై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు
టీడీపీ అనుబంధ విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరెవరు ఏం పని చేస్తున్నారో తనకు మొత్తం తెలుసన్నారు. పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారంటూ మండిపడ్డారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
