CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ , డేటా సెంటర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన కాలేజీ రోజుల్లో బుల్లెట్ నడపడం ఒక గర్వకారణంగా అనిపించేదని, అటువంటి ఐకానిక్ కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషమని తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని, ప్రతి వారం ఒక కొత్త కంపెనీని తీసుకువస్తూ, నిత్యం ఏదో ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఏపీలో తమ యూనిట్లను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయని, దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పరిశ్రమలు క్షేత్రస్థాయిలో త్వరగా ప్రారంభమయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశ్రామిక అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్గా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
