ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు? అని నిలదీశారు.. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని ప్రశ్నించారు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న బాలా కోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగనే సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు..
Read Also: COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
ఇక, ఇదే ఘటనపై స్పందించిన నారా లోకేష్.. హత్యలు, దాడులతో టీడీపీ కేడర్ని భయపెట్టాలనుకుంటున్న జగన్ పాపాలు.. శిశుపాలుడి పాపాల్లా పండిపోయాయి అని వ్యాఖ్యానించారు.. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం చేయిస్తోన్న హత్యలు, దాడులే జగన్ పతనానికి దారులుగా అభివర్ణించారు.. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ వైసీపీ గూండాల పనేనని ఆరోపించారు.. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అవుతుందన్న ఆయన.. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే.. వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థం అవుతోందన్నారు.. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్లోనే వున్న జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇకనైనా హత్యా రాజకీయాలు, దాడులు ఆపండి.. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి.. జగన్ అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకి ఇదే చివరి హెచ్చరిక అన్నారు. మేం తిరగబడితే, వైసీపీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు? అని ప్రశ్నించారు నారా లోకేష్.
