Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌తో భేటీపై స్పందించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

Byreddy Siddharth Reddy

Byreddy Siddharth Reddy

శాప్‌ ఛైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియతో పాటు మీడియాను షేక్‌ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి ఆయన.. శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని చర్చ కూడా సాగింది.. అయితే, ఈ ప్రచారంపై సీరియస్‌గా స్పందించారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి..

Read Also: CM Jagan: రాష్ట్రంలో రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం

తాను నారా లోకేష్‌ను కలిసింది ఏ మీడియా వారు చూశారు? ఆధారాలు ఉంటే తీసుకు రండి అని నిలదీశారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఇక, టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. ఎమ్మెల్యే ఆర్థర్ స్థానిక ప్రోటోకాల్.. నాది రాష్ట్రవ్యాప్త ప్రోటోకాల్ అందుకే ఇద్దరం కలువలేకపోతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. అమ్మ ఒడి, నాడు-నేడు.. ఇలా ఎమ్మెల్యే చేసే పనులకు నాకు సంబంధం లేదన్నారు సిద్ధార్థరెడ్డి.. మరోవైపు, నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు.. ఇక, టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణలో నష్టపోయిన షాపు యజమానులకు పరిహారం ఇవ్వకుండా దోచుకొని దాచుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కాగా, గత కొంత కాలంగా బైరెడ్డి.. టీడీపీలో చేరతారంటూ.. నారా లోకేష్‌ను కలిశారంటూ జరుగుతోన్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది.