NTV Telugu Site icon

పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి బాలుడు

స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక పిల్లలమీద ఒక కన్నేసి వుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యులు మొత్తుకుంటున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడి.. పిల్లలు ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ చేతిలో పట్టుకుని అదే మాయలో ఉంటున్నారు.అనంతపురం జిల్లాలో పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో బాలుడు.

ఈ గేమ్‌కు బానిసైన ఓ విద్యార్థి.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన 13 ఏళ్ళ విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలల నుంచి తన మొబైల్‌లో గేడ్ ఆడుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం సృహ తప్పి కిందపడిపోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తల్లిదండ్రులను కూడా అతను గుర్తు పట్టలేకపోతున్నాడు. నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడని తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుందంటున్నారు డాక్టర్లు.