నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ.. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఇక, కరపత్రాలు పంచుతున్న వాలంటీర్లను అడ్డుకున్నందుకు బీజేపీ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యం చేశారని ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు సోము వీర్రాజు.. నియోజకవర్గంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో దృష్టిసారించాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. అదే విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, ఏజెంట్లకు కూడా భద్రత కల్పించాలని కోరారు. కాగా, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే.. ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండగా.. బీజేపీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దింపింది.
