BJP MP Bandi Sanjay Fired on TRS Leaders and CM KCR.
సింగరేణి పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యమని, ఇదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమేనని ఆయన స్పష్టం చేశారు. కార్మికులారా… టీఆర్ఎస్ మాటలు నమ్మకండని, ఇవిగో ఆధారాలు అని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ మాటే ఉత్పన్నం కాదని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం… రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని, ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కొంగు బంగారంమైన నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
