ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాప్ (ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ) చైర్మన్ రవి నాయుడు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రిక త్వరగా కోలుకోవాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్రీడాకారిణి చంద్రికకు ప్రోత్సాహంగా శాప్ చైర్మన్ రవి నాయుడు రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన క్రీడాకారిణిగా చంద్రికను ఆయన అభినందించారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ క్రీడా రంగంలో రాణించాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు. 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో, 2019 ఆసియా పసిఫిక్ ఛాంపియన్షిప్లో చంద్రిక స్వర్ణ పతకాలు (స్క్వాట్, డెడ్లిఫ్ట్) సాధించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఆమె ప్రసిద్ధి చెందారు.
Also Read: Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
చంద్రికను పరామర్శించిన అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి అవసరమైన సహాయం అందిస్తాము. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చంద్రిక భవిష్యత్ టోర్నమెంట్లలో కూడా రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. చంద్రిక పోరాట స్ఫూర్తి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని అన్నారు.
