ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మొత్తం 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (IAS) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి గాను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అర్హత , ఆసక్తి గల మహిళా అభ్యర్థులు మే 27, 2026 నుండి జూన్ 05, 2026 వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 299 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 16 ప్రిన్సిపాల్ పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRT) , 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET) ఖాళీలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు జిల్లాలను మినహాయించి, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం, వయోపరిమితి, విద్యా అర్హతలు , ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://kgbvrecruitment.apcfss.in ను సందర్శించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో లేదా వెబ్సైట్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం అభ్యర్థులు సంప్రదించాల్సిందిగా హెల్ప్లైన్ నంబర్లను (70750 39990, 79933 29115) కూడా అధికారులు ఈ ప్రకటనలో జారీ చేశారు. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే కేజీబీవీల్లో అవకాశం ఉంటుంది కాబట్టి, నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
