Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం.. ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతోంది… భారత్‌కు చెందిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారని కేంద్రం తేల్చింది.. అందులో 4 వేల మంది వరకు ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మిగతావారిని రప్పించే ప్రయత్నాల్లో ఉంది.. భారత ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉండడంతో.. ప్రత్యేకం హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.. సీఎస్ సమీర్ శర్మ, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.. ఇక, కలెక్టర్ల స్థాయిలో కాల్‌ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Mahender Reddy: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. టికెట్‌ నాకే..!

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలి, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు.. అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని సూచించిన ఆయన.. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారానికి ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు, ఈ వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు సీఎం వైఎస్‌ జగన్.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై చర్చించిన ఆయన.. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వివరించారు జయశంకర్‌.. ఉక్రెయిన్‌ పక్కదేశాలకు తరలించి అక్కడనుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.