ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ఆయన.. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసానికి చేరుకోనున్నారు.. తన పర్యటనలో ముఖ్యంగా జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) యూనిట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం.. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది.
ఇక, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్లోని దహేజ్లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్ మూడోది. తొలి దశ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు ఏపీ సీఎం. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనున్నట్టు అంచనా వేస్తున్నారు.. ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా భూమి పూజ నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభించనుంది. వీటికి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది.
ఇక, సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..
* ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న సీఎం…
*10.30కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీసెజ్కి సీఎం జగన్…
* ఏటీసీ టైర్స్ ఏపీ ప్రేవేట్ లిమిటెడ్ యూనిట్, ఉత్పత్తులు ప్రారంభించనున్న ఏపీ సీఎం..
* అచ్యుతాపురం ఏపీ సెజ్ లో మరికొన్ని పరిశ్రమలకు భూమిపూజ కార్యక్రమం
* మధ్యాహ్నం 12.40 గంటకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం వెళ్లనున్న సీఎం..
* మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసంకు ముఖ్యమంత్రి.. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించనున్న జగన్….
* 1.40 గంటలకు విశాఖ నుంచి తిరుగు పయనమై 3.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్..