Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు ఏపీ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని.. భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
Read Also: Archana Gautham: తిరుపతి దేవస్థానంలో సినీ నటి రచ్చ.. తప్పుగా ప్రవర్తించారంటూ
రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయని.. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయని అభిప్రాయపడ్డారు. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని జగన్ తెలిపారు. అటు వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఐపీబీ సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. రూ. 386.23 కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది.ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
