మత్తులో జరిగే హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ను తాగి రెండేళ్లుగా ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారన్నారు. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ తిప్పారో ప్రజలకు చెప్పాల్సిన అసరం ఉందన్నారు. ఆడవాళ్ల తాళి బొట్లు తెగిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు.
పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలతో పోల్చుకుంటున్న ప్రభుత్వం….అభివృద్ధి విషయంలో ఆ పోటీ ఏమైందని ప్రశ్నించారు. ఐ.ఏ.ఎస్. అధికారులు మద్యం అమ్మకాలు పెంచడంపై రివ్యూ చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. వైన్ షాపుల దగ్గర ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలులోకి రావడం లేదన్నారు. గల్లాపెట్టెలు నింపుకోవడానికే వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ పెట్టడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, వాలంటీర్లు, గంజాయి, నాటుసారా అమ్మకాలు చేపడుతున్నారంటూ అనిత దుయ్యబట్టారు.
Read Also:
