ఏపీలో ఉపాధ్యాయులకు పరీక్ష పెట్టింది ప్రభుత్వం. ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంట్గా పరిగణించేలా యాప్ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో దిగొచ్చిన ప్రభుత్వం 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, ఉపాధ్యాయులు 9.10 గంటలలోపు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు వేసుకోవచ్చు. అలాగే, మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చింది.
నెట్వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయకుంటే ఆఫ్లైన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు పొరపాటున సెల్ఫోన్ మర్చిపోయి స్కూలుకు వస్తే తమ సహచర ఉపాధ్యాయుల సెల్ ఫోన్ ద్వారా, లేదంటే ప్రధానోపాధ్యాయుడి సెల్ఫోన్ ద్వారా హాజరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే, డిప్యుటేషన్, శిక్షణ తదితర వాటికి వెళ్లినప్పుడు, ఆన్డ్యూటీలో ఉన్న వారి కోసం ఈ నెల 25 నుంచి ప్రత్యేకంగా లీవ్ మాడ్యూల్ను తీసుకురానుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సెలవుల వివరాలను కూడా యాప్లోనే అప్డేట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
ఏపీలో ఉపాధ్యాయులు ఈ విధానం ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఇటీవల మంత్రి బొత్స ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మొదటగా విద్యాశాఖలో ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చానారు. అటెండెన్సు యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. యాప్ వల్ల తాము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
Read Also: Ireland: మహిళ వయసు అడిగినందుకు పరిహారం.. రూ.3 లక్షలు చెల్లించిన డోమినోస్