YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని ఎంపీలకు జగన్ సూచించారు. ప్రజల ప్రయోజనాలే పార్టీకి ప్రధానమని, వాటి కోసం గట్టిగా గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే మద్దతు తెలిపిందని గుర్తు చేసిన జగన్, ఆ మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పిందని ఆరోపించారు. డీఎస్పీ పోస్టుల భర్తీ, డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పోటీ పరీక్షలు లేకుండానే నియామకాలు జరిగాయని, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.
అమరావతి నిర్మాణం, భూకేటాయింపులు, రోడ్ల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు. భూముల పూలింగ్కు అంగీకరించని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని, సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టులు చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఇక, టీచర్ల సమస్యలపై కూడా జగన్ స్పందించారు. టెట్ ప్రవేశపెట్టే ముందు నుంచే ఉద్యోగాల్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి సమస్యను వివరించాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
రాష్ట్ర ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో తక్కువ ధరలకు అప్పగిస్తున్నారని జగన్ విమర్శించారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. దాదాపు పూర్తయిన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రాష్ట్రానికి భవిష్యత్తులో వచ్చే ఆదాయం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలాగే భూకేటాయింపులు, ఇసుక, మైనింగ్, మద్యం విధానాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘిస్తూ రెండు సంవత్సరాల్లో రూ.3.6 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని జగన్ విమర్శించారు. ఆక్వా రైతులు సిండికేట్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని, భీమవరం సభలో రైతుల ఆగ్రహం స్పష్టంగా కనిపించిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ల వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలను పార్లమెంట్ వేదికగా బలంగా ప్రస్తావించి రాష్ట్ర ప్రజల తరఫున పోరాడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

