NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై కీలక నిర్ణయం..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్.. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కానుంది.. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.. పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.. ఇక, అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం.

Read Also: National Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ నటుడిగా రిషబ్ శెట్టి

ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామికానుంది టాటా గ్రూప్. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై టాటా గ్రూప్ ఛైర్మన్‌తో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి.. 2047 నాటికి ఏపీని నంబర్‌ వన్‌ ప్లేస్‌లో నిలపడమే లక్ష్యంగా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ @ 2047 ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. చంద్రశేఖరన్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు కో-ఛైర్‌గా ఉంటారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు.. ఎయిర్ ఇండియా, విస్తారాతో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచే అంశంపై చంద్రశేఖరన్ తో చర్చించాం. వివిధ రంగాలలో అనేక ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశం పైనా చర్చించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.