Saikrishna Custodial Death Case: సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్, లాకప్ టార్చర్, మృతదేహం అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరుసగా ఐదో రోజు కూడా సుదీర్ఘంగా విచారించగా, మరోవైపు ఆయన భార్య భవాని దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ ముగించి తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. అయితే, సిట్ కస్టడీలో తన భర్తను నిబంధనలకు విరుద్ధంగా విచారిస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సీఐ నాగరాజు భార్య భవాని హైకోర్టును ఆశ్రయించారు. కస్టడీ సమయంలో కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనలను ఉల్లంఘిస్తూ 24 గంటల్లో ఎప్పుడైనా విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, కోర్టు నిర్దేశించిన నిబంధనల ప్రకారమే సిట్ విచారణ కొనసాగుతోందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.
ఇక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు, సీఐ నాగరాజును ఐదో రోజు కూడా పలువురు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సాయికృష్ణ కస్టడీలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, లాకప్లో జరిగిన ఘటనలు, మృతదేహం అదృశ్యం వెనుక ఉన్న పరిస్థితులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర, పోలీసు సిబ్బంది సహకారం వంటి అంశాలపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. అలాగే స్టేషన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులతో ఉన్న సంబంధాలు, మరో సీఐ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు, లాకప్ డెత్ ఘటనలో ఇతర పోలీసు అధికారుల సహకారం, టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అప్పగించినప్పుడు అతని శరీరంపై గాయాలు ఉన్నాయా, ఏడీసీపీ లతకుమార్పై వచ్చిన ఆరోపణలు, సాయికృష్ణ తల్లి చేసిన ఆరోపణలపై వివరణ కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సీఐ నాగరాజు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం పాటించినట్లు సమాచారం.
మరోవైపు కేసులో నిందితులైన ఏ5 సాంబయ్య, ఏ6 బాబూరావును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సాంబయ్య, బాబూరావు కూడా జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో వరుస పరిణామాలతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. కేసులో ఇతర నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, పోలీసు అధికారుల పాత్రపై కూడా సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

