Heavy Rain and Thunderstorms: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఉత్తరాంధ్ర జిల్లాలకు కీలక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితుల దృష్ట్యా ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
అదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని APSDMA విజ్ఞప్తి చేసింది. అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, రైతులు మరియు మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

