Perni Nani: టెట్‌ క్వాలిఫై కానివారు మెరిట్‌ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టే దమ్ముందా?

Perni Nani

Perni Nani

Perni Nani: మరోసారి డీఎస్సీ నియామకాలపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని.. యువగళం డీఎస్సీ పేరుతో జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన.. డీఎస్సీకి సంబంధించిన పాపాలను కప్పిపుచ్చడం తాత్కాలికమేనని, అక్రమాల దొంకలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. కర్నూలు జిల్లాలో టెట్‌ క్వాలిఫై కానివారికి కూడా టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చారని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, యువగళం డీఎస్సీలో టెట్‌ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టెట్‌లో అర్హత సాధించని అభ్యర్థులు డీఎస్సీ మెరిట్‌ జాబితాలోకి ఎలా వచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కర్నూలుతో పాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్పోర్ట్స్‌ కోటా ద్వారా జరిగిన నియామకాలపైనా అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 24 మంది స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందారని, ఈ నియామకాలకు సంబంధించిన సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని కోరారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో బహిరంగంగా పెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం గోతులదొడ్డి పాఠశాలలో సర్టిఫికెట్ల పరిశీలన జరగడంపై కూడా పేర్ని నాని అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు టెట్‌లో అర్హత సాధించని వారికి సర్టిఫికెట్ల పరిశీలన ఎలా జరిగిందని ప్రశ్నించారు. డీఎస్సీ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక కారణాలేంటని నిలదీశారు. గతంలో డీఎస్సీపై ఆరోపణలు వచ్చినప్పుడు ఐఏఎస్ అధికారులతో వివరణ ఇప్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

స్పోర్ట్స్‌ కోటాలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై గతంలో జగన్ ప్రశ్నించినప్పుడు అంతా బాగానే ఉందని చెప్పారని పేర్ని నాని ఆరోపించారు. అక్రమాలు జరిగాయని ప్రశ్నిస్తే ఆటగాళ్లను పీవీ సింధూతో పోల్చారని విమర్శించారు. సామాన్యులు ఆడే క్రీడలను బీ కేటగిరీలో పెట్టి, రాష్ట్రంలో ఎక్కువగా ఆడే క్రీడలకు ఏ కేటగిరీ కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జరగని ఈవెంట్లకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చుకుని ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటా వ్యవహారంలో శాప్‌ పాత్రపైనా పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. శాప్‌ ఒక పెద్ద దొంగల బండిలా మారిందని వ్యాఖ్యానించారు. శాప్‌ చైర్మన్‌ ఈ వ్యవహారాల్లో ఎవరి అండతో నిర్ణయాలు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

డీఎస్సీ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా లోకేష్‌ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలను మానుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో లోకేష్‌ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. నిజాయితీగా ఉద్యోగాలు పొందిన వారిని తాము ఎక్కడా తప్పుపట్టడం లేదని, అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపైనే విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇప్పుడు టెట్‌ క్వాలిఫై కావాలని చెబుతున్న ప్రభుత్వం, యువగళం డీఎస్సీలో టెట్‌ అర్హత లేనివారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిందని పేర్ని నాని ఆరోపించారు. ఈ విషయంలో లోకేష్‌ ఆత్రంతో వ్యవహరిస్తూ కామెడీ పీస్‌లా మారిపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 88 శాతం అక్షరాస్యత ఉందంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత వాస్తవ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని పేర్ని నాని అన్నారు. ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తూ సీఎం చంద్రబాబు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పెన్షన్ల ఖర్చు భరించలేని భారంగా మారుతోందని లోకేష్‌ ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేటప్పుడు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. యువగళం డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలను కప్పిపుచ్చేందుకే మరో డీఎస్సీ నిర్వహిస్తామని చెబుతున్నారని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించారా అని ప్రశ్నించారు. పోలీసులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్‌పై విషప్రచారం చేసి ఉద్యోగులను దూరం చేశారని పేర్ని నాని విమర్శించారు. డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లోని ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలని, అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని..