Pawan Kalyan Health Update: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు శస్త్ర చికిత్స విజయవంతమైంది.. ముంబైలో పవన్ కుడి భుజానికి విజయవంతంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, పవన్ కల్యాణ్ రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలతో బాధపడుతున్నారు. 2016లో తగిలిన గాయాలు కాలక్రమేణా తీవ్రంకావడంతో పాటు పోరాట యాత్ర, వారాహి యాత్రల సమయంలో మరింత ప్రభావం చూపినట్లు గుర్తించారు. అభిమానులతో తరచూ కరచాలనాలు చేయడం, చేతులు పట్టి లాగడం వల్ల కూడా భుజాలపై అదనపు ఒత్తిడి పడినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కండరాల చీలికలు, రొటేటర్ కఫ్ గాయాలు స్పష్టంగా బయటపడటంతో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం పవన్ కల్యాణ్ ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. మరో రెండు నెలల్లో ఎడమ భుజానికీ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం.
దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ”పవన్ కల్యాణ్కి శనివారం ఉదయం ముంబైలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని వైద్యులకు తెలియచేశారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నారు..
పదేళ్ల నుంచి నొప్పి భరిస్తూ…
పవన్ కల్యా్ణ్కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ తో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో పవన్ కల్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది..” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం..
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్… తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు… పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు…— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) July 11, 2026

