Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు

  • సూపర్ ఎల్ నినోపై అప్రమత్తం కావాలి..
  • రైతులకు అవగాహన కల్పించాలన్న పవన్‌ కల్యాణ్‌..
  • సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష..
  • ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్ నినో ప్రభావం, సాగునీటి పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి పరిస్థితులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పవన్ కు వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితులను తెలియజేయడంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు.

సూపర్ ఎల్ నినో ప్రభావంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలు, సాగునీటి లభ్యతపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రతి రైతు ప్రధాని ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదేనని, నీటి వృథాను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తొలగింపు, గట్ల లీకేజీల మరమ్మతులు చేపట్టి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రత్యామ్నాయ చర్యలు అమలు చేయాలని సూచించారు.

ఇదే సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిశీలించిన మంత్రి, పరిస్థితులను పవన్‌కు వివరించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, సాగునీటి నిర్వహణలో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..