Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్‌పై కీలక ఆదేశాలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, సముద్ర కోతల నివారణ లక్ష్యంగా చేపట్టిన ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం తీసుకురావాలని డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు అమలు, డివిజన్ల వారీగా లక్ష్యాల సాధన, మొక్కల నాటకం, మడ అడవుల విస్తరణ వంటి అంశాలపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ, 5 వేల హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు పవన్‌ ల్యాణ్‌.. అలాగే వీబీజీ రామ్‌జీ (VBG Ramji) పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు కేటాయించామని, వాటిని 2,500 హెక్టార్లలో నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సామాజిక వనాలు, తాటి వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.

గత రెండేళ్లలో రాష్ట్రం 2,670 హెక్టార్లలో మడ అడవుల విస్తరణ చేపట్టి దేశంలో రెండో స్థానం సాధించిందని పవన్ పేర్కొన్నారు. ఈ ఏడాది MISHTI-II పథకం కింద మరో 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద 1,993 హెక్టార్లలో అటవీకరణ, అలాగే 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో మూడు అంచెల గ్రీన్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. వాతావరణ మార్పులు, సముద్ర కోతలు, ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కీలక రక్షణ కవచంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌..