Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ తరహా అక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
మద్యం విక్రయాల విషయంలో దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజలను దోచుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, మద్యం విక్రయాల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
