Janasena MLA Arava Sridhar Incident: మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించనుంది. ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను సమగ్రంగా పరిశీలించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు అందజేయనుంది.
Read Also: UGC rules: కులాల పేరుతో సమాజాన్ని విభజిస్తారా.? UGC నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే..
విచారణ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ కఠినంగా వ్యవహరించే అవకాశముందని, మహిళల భద్రత, న్యాయం విషయంలో రాజీ ఉండదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుండగా, విచారణ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై బాధితురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అంతేకాకుండా.. బాధితురాలు విడుదల చేసిన వీడియోలు వైరల్గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించిన విషయం విదితమే..
