Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027ను పురస్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా భారీ ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి. గత పుష్కరాల సందర్భంగా భక్తులకు వైద్య సేవల్ని అందించడంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజులపాటు జరిగే పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారన్న ఆంచనాలకు అనుగుణంగా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఐఐసీలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని విభాగాల అధిపతులతో మంత్రి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షుణ్ణంగా చర్చించారు. ఇందులో చర్చించిన ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖ తరఫున తీసుకునే చర్యలకు సుమారు 490 సివిల్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రాథమిక స్థాయిలో రూ. 93 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ అంచనా వ్యయాన్ని తగ్గించేందుకు మరోసారి లోతుగా పున:సమీక్షించి అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నిర్మాణాలు, ఇతర ముఖ్య చర్యలపై ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చర్చించాల్సి ఉంటుందని, అందుకు అధికారులు సన్నద్ధం కావాలని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తయారుచేసిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్న ప్రకారం ఏర్పాట్ల ప్రతిపాదనల వివరాలిలా…!
ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు
గత పుష్కరాల్లో 225 ఘాట్లను ఏర్పాటు చేయగా, ఈసారి మరో 300 ఘాట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయనున్నారు. ఘాట్లను భక్తుల రద్దీ ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు. అత్యధికంగా కోనసీమలో 175, తూర్పుగోదావరిలో 167 ఘాట్లు ఉన్నాయి.
1,110 వైద్య శిబిరాలు
భక్తుల ఆరోగ్య రక్షణకు 1,110 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా 950 ఫస్ట్ ఎయిడ్ పోస్టులు, 300 హెల్త్ పోస్టులు, 30 ఫీల్డ్ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఘాట్లో అవసరానికి అనుగుణంగా వైద్య బృందాలు, ఆక్సిజన్, అత్యవసర పరికరాలు, స్ట్రెచర్లు, వీల్చైర్లు సిద్ధంగా ఉంచనున్నారు. భక్తుడికి ఘాట్ వద్ద ప్రాథమిక చికిత్స అందించి.. అవసరమైతే PHC/CHC, అక్కడి నుంచి ఏరియా లేదా జిల్లా ఆసుపత్రి, చివరగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి/మెడికల్ కాలేజీకి తరలించేలా బహుళ అంచెల వైద్య రిఫరల్ వ్యవస్థను అమలు చేయనున్నారు.
అంబులెన్స్కు ప్రత్యేక గ్రీన్ కారిడార్
గత పుష్కరాల్లో అంబులెన్సులు జనసందోహంలో చిక్కుకోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈసారి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. అంబులెన్సుల కోసం ప్రత్యేకంగా భౌతిక బారికేడ్లతో మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో గ్రీన్ కారిడార్ను అమలు చేస్తారు. మొత్తం 523 వాహనాలను రంగంలోకి దించనున్నారు. 108 అత్యవసర అంబులెన్సులు, 104 మొబైల్ హెల్త్ యూనిట్లు, మాతా-శిశు సేవలకు ప్రత్యేక వాహనాలు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఫీడర్ వాహనాలు 19 బోటు అంబులెన్సులు నడపనున్నారు.
తాత్కాలిక ప్రాతిపదికన 30 ఫీల్డ్ ఆసుపత్రులు
భక్తుల రద్దీ నేపథ్యంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినా, అనారోగ్యానికి గురైనా చికిత్స అందించేలా 30 ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర తరలింపు కోసం ముందుగానే ఎవాక్యుయేషన్ ప్రణాళికలు రూపొందించి, పుష్కరాలకు ముందే పూర్తిస్థాయి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
30 వేలకుపైగా సిబ్బంది
పుష్కరాల వైద్య సేవలకు వైద్య శాఖ అన్ని విభాగాల్లో కలిపి సుమారు 30,196 మంది అవసరమని అంచనా వేశారు. వీరిలో వైద్యులతో పాటు పారా మెడికల్ , ఇతర సిబ్బంది ఉన్నారు. అలాగే తాత్కాలిక ప్రాతిపదికన స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బందిని జిల్లా స్థాయి సిబ్బంది, డిప్యూటేషన్, కాంట్రాక్టు నియామకాలు( సుమారు 1600) చేపట్టనున్నారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారి సేవల్ని, స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చిన వారి వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నారు. అలాగే గత పుష్కరాల సమయంలో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉచిత బస, ఇతర సౌకర్యాల కల్పించే విషయంలో ముందుగానే చర్యలు తీసుకోనున్నారు. గోదారి పుష్కరాల పరిధిలోని 23 ఆసుపత్రుల్లో మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆక్సిజన్ పైప్లైన్లు, టాయిలెట్లు తదితర పనులకు రూ.23.09 కోట్ల అంచనా ఉండగా, తొలి దశలో సుమారు రూ.8 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగానే రాజమండ్రి బోధనాసుపత్రిలో అదనపు పడకలు, నిర్మాణాలు, అదనంగా అత్యవసర వైద్య సేవల ఆవశ్యకత గురించి కూడా పలు ప్రతిపాదనలు చేశారు. పుష్కరాల ఏర్పాట్లకు కచ్చితమైన గడువులు పెట్టారు. చర్యలకు అవసరమైన పరిపాలనా అనుమతులు, అంచనాలు, టెండర్లు, నిర్మాణాలు, కొనుగోళ్లు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది సమీకరణ, శిక్షణ, ఇతర చర్యలను ఏప్రిల్ 30, 2027 నాటికి పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

