Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మొత్తం ఏడు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్లు వేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 35(3) BNSS ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఈ రోజు ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో అంబటి రాంబాబు పై పిటి వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులపై హైకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: CM Chandrababu: బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డూ.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
