Deputy CM Pawan Kalyan: విశాఖలో అక్రమంగా గో మాంసం నిల్వ ఘటనపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గో మాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపడాలంటూ.. విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా.. ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే.. పవన్ కల్యాణ్ స్వయంగా పోలీస్ కమిషనర్ను సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారో? ఎక్కడి నుంచి తెచ్చారో? ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారో? వీటి అన్నిటి పై ఆయన వివరంగా ఆరా తీశారు.
Read Also: Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
DRI అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో.. 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు.. ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు వివరించారు. దాడుల సమయంలో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోందని కూడా తెలిపారు. ఈ గోమాంసం ఎక్కడి నుంచి తెచ్చారు? అక్రమ రవాణా నెట్వర్క్ ఎంత పెద్దది? అవసరమైన అనుమతుల విషయంలో ఏయే ఉల్లంఘనలు జరిగాయి? ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కూడా హామీ ఇచ్చారు. NDA ప్రభుత్వం గోమాంసం నిషేధంపై ఎంత దృఢంగా పనిచేస్తుందో.. ఈ కేసు మరోసారి నిరూపించిందని అన్నారు పవన్ కల్యాణ్. అక్రమ గోవధ, గోమాంస విక్రయం, లేదా ఎగుమతి.. ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గతంలో పిఠాపురం జంతు వధశాల ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే.. దానిపై చర్యలు తీసుకొని వధశాలను మూసివేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
