CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్‌.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా..?

  • మంత్రులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..
  • కేబినెట్ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సీఎం భేటీ ..
  • కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? అంటూ ఆగ్రహం..
Cm Chandrababu Warns Ap Min

Cm Chandrababu Warns Ap Min

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. అయితే, కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిరుపతిలో గోవుల మృతిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారాన్ని తిప్ప కొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని మండిపడ్డారు సీఎం.. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తుంటే.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు.. జిల్లాలు యూనిట్‌గా తీసుకొని పార్టీ.. ప్రభుత్వం.. మంత్రులు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలన్నారు.. అంతేకాదు.. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరిలో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.. వ్యక్తిగత కార్యదర్శులు, వోఎస్‌డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి.. వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు..

Read Also: Nagashvin : ఆ మూవీ ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లా : నాగ్ అశ్విన్

మంత్రులూ.. జాగ్రత్త.. అవినీతి అధికారులను దూరం పెట్టండి అని సూచించారు సీఎం చంద్రబాబు.. మత పరమైన అంశాలపై సంయమనంతో స్పందించాలన్న ఆయన.. ఎన్ని సార్లు చెప్పినా మీలో మార్పు కనపడడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.. చేసింది చెప్పుకోలేకపోతున్నాం.. సరిగ్గా స్పందించలేకపోతున్నాం.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మొత్తం 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది.. వాటిపై చర్చించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది మంత్రి మండలి.. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో చర్చ సాగింది.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది.. ఇక, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే..