CM Chandrababu: ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో Gen Z కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Gen Z అంటే ఏదో ప్రత్యేకమైన విషయం కాదని, తమకు సరైన న్యాయం జరగలేదని అనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను ఏసీ గదుల్లో కూర్చొని పట్టించుకోకపోతే కడుపుమండినవారు ఏం చేస్తారో.. ప్రస్తుతం Gen Z కూడా అదే చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు మానవీయ కోణం ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సానుభూతితో, మానవీయ దృక్పథంతో పాటు సరైన ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను కేవలం అధికారిక ప్రక్రియగా కాకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పరిష్కరించే విధంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఉత్పాదకంగా ఉండేలా ఆలోచించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు మొత్తం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.73 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్ల వరకు ఖర్చు చేశామని వెల్లడించారు. కేవలం నగదు పంపిణీ చేస్తూ ఉంటే ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వ నిధులను ఉత్పాదకంగా వినియోగించాలని సూచించారు. ప్రజల ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించేలా అధికారులు ఆలోచించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

