CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరగా పరిష్కరించేలా పనిచేయాలని తెలిపారు.
యుద్ధ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇక, గ్యాస్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం తెలిపారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు కృషి చేయాలని సూచించారు. మరోవైపు.. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై పూర్తి వివరాలను వచ్చే నెలలో వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
