CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్‌ ఎటాక్‌.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

  • వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి..
  • మంత్రులతో గ్రూప్-1పై సీఎం చంద్రబాబు..
  • అసెంబ్లీ వేదికగా డీఎస్సీపై కౌంటర్‌కు రెడీ అవుతున్న కూటమి..
  • అవసరం అయితే ఉద్యోగం రాని గ్రూప్-1 అభ్యర్థులతో చర్చ..
  • రాజకీయంగా గట్టి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో మంత్రులు..
  • సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
Cbn

Cbn

CM Chandrababu: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అర్హులకు ఉద్యోగాలు రాలేదని తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. వీటిపై ఏపీ ప్రభుత్వం అధికారుల నుంచి కౌంటర్ ఇప్పించింది. మంత్రులు కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. పదే పదే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రూప్-1పై సిట్ నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం డీఎస్సీకి కౌంటర్‌గా గ్రూప్-1ను తెరమీదకు తెస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అంశం చర్చకు వచ్చింది. గ్రూప్-1 మూల్యాంకనంలో 97 శాతం జవాబు పత్రాలు దిద్ది ఉండటంపై సీఎం చంద్రబాబు, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించడంపై వస్తున్న వార్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ గ్రూప్-1 వ్యవహారంపై వైసీపీని ఎండగట్టాలని సీఎంను కోరారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. మరికొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందని, దీనిపైనా దర్యాప్తు జరపాలని చంద్రబాబుకు మంత్రులు విజ్ఞప్తి చేశారు.

2011లో మహారాష్ట్రలోనూ ఇలానే జరిగితే అక్కడ అభ్యర్థులు పోరాటం చేశారని మంత్రులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని మంత్రులకు సూచించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించేందుకు కొంతమంది పోలీస్ శాఖ అధికారులకు ప్రభుత్వం టాస్క్ ఇచ్చిందన్నారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. వారితో వెంటనే మాట్లాడాలని, సమాచారం సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అలాగే, డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని శాసన మండలిలో వైసీపీ లేవనెత్తితే దీటుగా సమాధానం చెబుదామని పేర్కొన్నారు. వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో సహా అగ్రెసివ్‌గా కౌంటర్ ఇవ్వాల్సిందేనని మంత్రులకు స్పష్టం చేశారు. పొలిటికల్ ఎటాక్ స్ట్రాంగ్‌గా ఉండాలన్నారు. కౌన్సిల్‌లో డీఎస్సీపై చర్చకూ సిద్ధమని, ఆరోపణలు చేసే వారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. దీంతో కౌన్సిల్‌లో డీఎస్సీపై వైసీపీ చేసే విమర్శలకు తీవ్ర స్థాయిలో తిప్పికొట్టాలని కూటమి డిసైడ్ అయింది. అవసరం అయితే ఉద్యోగం రాని గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడి.. మరింత ఎక్కువ సమాచారం బహిర్గతం అయ్యేలా కూడా చూసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. డీఎస్సీపై ఇప్పటికే అధికారులు అన్ని విషయాలు చెప్పారని, అయినా కావాలని బురద చల్లితే మాత్రం రాజకీయంగా వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు కూడా తేల్చి చెప్పడంతో.. మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత దూకుడుగా అసెంబ్లీ సమావేశాల్లో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. డీఎస్సీకి కౌంటర్‌గా గ్రూప్-1పై దృష్టి పెట్టనున్నారు కూటమి నేతలు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో హీట్ పుట్టే అవకాశం కనిపిస్తోంది.