Polavaram-Banakacherla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (PBLP)కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ToR ప్రతిపాదన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు అందింది. ఈ ప్రతిపాదనను జూన్ 17న నిపుణుల మదింపు కమిటీ (EAC) పరిశీలించింది. అయితే ప్రాజెక్టుకు పర్యావరణ మదింపు కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించే ముందు కేంద్ర జల సంఘం (CWC) అంతరాష్ట్ర జల వివాదాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. అదే సమయంలో, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందంటూ పలు ఫిర్యాదులు కూడా కేంద్రానికి అందినట్లు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల మదింపు కమిటీ చేసిన సిఫారసుల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన ToR ప్రతిపాదనను వెనక్కి పంపినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

