Centre Releases Rs 1,805.24 Crore to AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రూ.1,805.24 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పేద మరియు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. నరేగా నిధులు గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు పనిదొరకడంతో పాటు వారి కుటుంబాలకు జీవనోపాధి భద్రత లభిస్తుందని వివరించారు.
అదే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో కూడా ఈ నిధులు ఎంతో కీలకమని పేర్కొన్నారు పెమ్మసాని… ప్రతి అర్హుడికీ ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవనోపాధి స్థిరత్వాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
