Nandamuri Balakrishna: అమరావతి పరిధిలోని తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం, మరియు ఆస్పత్రి ప్రాజెక్ట్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలకు బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం వల్లే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం ప్రత్యేకమని, అది తన తండ్రి మరియు తనకు దైవసమానమైన నరసింహ స్వామి పుట్టిన నక్షత్రం కావడంతో ఈ రోజున పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Read Also: Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
అమరావతిలో ఇప్పటికే ఆగస్టు 13న ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశామని, అయితే నిర్మాణం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు రావడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు బాలయ్య… ఇప్పుడు అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశలో 7 అంతస్తులతో 500 పడకల సదుపాయం కలిగిన ఆధునిక ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దాదాపు రూ. 650 కోట్ల వ్యయంతో ఈ దశను అమలు చేయనుండగా, 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంపై కూడా బాలకృష్ణ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదని, గొప్ప ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు. ఏదో హడావుడిగా నిర్మించి మళ్లీ కూల్చేసే విధంగా కాకుండా, పద్ధతిగా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు నందమూరి బాలకృష్ణ..
