LPG Supply: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
ఎక్కడి నుంచి సరఫరా?
రాష్ట్రానికి గ్యాస్ సరఫరా ప్రధానంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ విశాఖపట్నం నుంచి జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా Mangaluru నుంచి వచ్చే హస్సన్–చర్లపల్లి పైపులైన్ ద్వారా కూడా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అలాగే Bharat Petroleum, Indian Oil Corporation సంస్థల ద్వారా రాష్ట్రానికి గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు మంత్రి నాదెండ్ల..
బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు
గ్యాస్ బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాల జాయింట్ కలెక్టర్లు గ్యాస్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే గ్యాస్ సరఫరాలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు.. గ్యాస్ కొరతపై పుకార్లు సృష్టించి ధరలు పెంచినా, సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని సూచించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
